చుంచుపల్లి, మే 5: సీఎం పీఏలమని నమ్మించారు. మరుగుజ్జులకు రుణాలని ఎరవేశారు. డిపాజిట్ పేరుతో రూ.35 లక్షలతో ఉడాయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంనగర్లో చోటుచేసుకున్నది. రాంనగర్లో ఉండే గుగులోత్ శంకర్, రాణి దంపతుల కుమార్తె స్వాతి మరుగుజ్జు. మనోధైర్యంతో ఆమె యూట్యూబ్ స్టార్గా పేరు తెచ్చుకున్నది. యూట్యూబ్లో వీడియోలు చూసిన శ్రీనివాస్, కోటేశ్.. సీఎం పీఏలమని నమ్మించారు. సీఎం ప్రత్యేకనిధి నుంచి మరుగుజ్జులకు సాయం అందిస్తామని నమ్మబలికారు. రాంనగర్కు వచ్చి బిజినెస్ లోన్ ఇప్పిస్తామన్నారు. ‘బిజినెస్ లోన్ కు మీరు అర్హులు కాదు. మీ తండ్రి కూడా దివ్యాంగుడు. ఇద్దరికికలిపి 60 లక్షలవరకు హౌసింగ్లోన్ ఇప్పిస్తాం. విషయం ఎవరికీ చెప్పొద్దు’ అని నమ్మించారు. అందుకు రూ.35 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పారు. కుటుంబసభ్యులు.. పొలాన్ని అమ్మారు. మోసగాళ్లు ఈ నెల 3న.. రూ.60 లక్షల డమ్మీ కరెన్సీ నోట్లు ఇచ్చి రూ.35 లక్షలు స్వాతినుంచి తీసుకొని ఉడాయించారు. మరుసటి బ్యాగు లో చూడగా చెల్లనినోట్లు కనిపించడంతో ఫిర్యాదుచేశారు.