మహబూబ్నగర్ మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా వేగంగా విస్తరిస్తున్నందున గత్యంతరం లేక ఈ నెల 12నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్డౌన్ ప్రభావంతోపాటు వివిధ రంగాల్లో పనిచేసే వారికి ఉపాధి అవకాశాలు సైతం క్రమంగా తగ్గిపోయాయి. హైదరాబాద్లో ఆటో నడుపుతూ, అడ్డా కూలీలుగా పనిచేస్తూ, వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు, ఇండ్లళ్లో పనులు చేసేవారు ఇలా వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందేవారు. ప్రస్తుతం కరోనా వైరస్తోపాటు లాక్డౌన్ వల్ల పనులు తగ్గిపోయాయి. చాలామంది యజమానులు కరోనా వైరస్ ప్రబలుతుందనే భయంతో కూలీ పనులు ఇవ్వడం మానేశారు. ఇండ్లలో పాచీ పనులు సైతం బంద్ అయ్యాయి. ఎక్కడ ఇండ్లల్లోకి వస్తారో.. వైరస్ మహమ్మారి ఎక్కడ సోకుతుందో అనే భయంతో పలువురు గేట్లకు తాళాలు వేసేస్తున్నారని ఇండ్లల్లో పనిచేసే వారు వాపోతున్నారు. ఆటోలు నడిపే వారికి కిరాయి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత్యంతరం లేక సొంతూళ్లకు పయనమయ్యారు. అక్కడ ఉన్నప్పుడు ఓ మోస్తరుగా సంపాదించినా.. ఇప్పుడు ఉపాధి హామీ పనులు చేస్తూ బతుకు బండి లాగుతున్నారు. ఆపద సమయంలో ఉపాధి హామీ ఎంతో ఆదుకుంటోందని పలువురు కూలీలు అంటున్నారు.
ఉపాధి కల్పిస్తాం..
కరోనా కారణంగా ఉపాధి పనుల ద్వారా చాలామంది కూలీలకు సర్కారు అండగా ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటికే 31,010 పనులు చేపట్టి.. 59,693 కూలీలకు ఉపాధి కల్పించాం. రూ. 17.22 కోట్లు కూలీగా చెల్లించాం. వలస వెళ్లిన వారు ఎవరైనా సరే తమకు పని కావాలంటే వెంటనే జాబ్ కార్డు జారీ చేసి పని కల్పిస్తాం. – యాదయ్య, డీఆర్డీవో, మహబూబ్నగర్
రోజుకు రూ. వెయ్యి మిగిలేది
గచ్చిబౌలి నుంచి కొండాపూర్కు లోకల్ ఆటో నడిపేవాడిని. అన్నీపోయి రోజుకు రూ.వెయ్యి వరకు మిగిలేది. లాక్డౌన్ వల్ల రోడ్లపైకి జనం వచ్చుడే తగ్గిపోయింది. రూ. 200మించి సంపాదించే పరిస్థితి లేదు. ఇంటి కిరాయి రూ. 3వేలు, హైదరాబాద్లో ఖర్చులూ ఎక్కువే. వేరే దారి లేక కిరాయి ఇళ్లు ఖాళీ చేసి ఆటోలోనే కుటుంబంతో సహా ఊరికి వచ్చినం. ఇప్పుడు ఉపాధి పని చేస్తున్నం. రోజుకు రూ. 200కుపైగా గిట్టుబాటు అవుతున్నది. సొంతిళ్లు ఉండడంతో కిరాయి బాధలేదు. ఉన్న ఊరిలో ఉన్నంతలో జీవిస్తున్నాం. పరిస్థితి మెరుగైతే తిరిగి పట్నం పోతం.