కీసర : ప్రమాదం అని తెలిసినా.. అక్రమంగా బయో డీజిల్ దందా చేపట్టారు.. తాజాగా పెరిగిన డీజిల్ ధరలను దృష్టిలో పెట్టుకుని బయో డీజిల్ను తక్కువ ధర కు విక్రయించి లక్షలు సంపాదిద్దామనుకున్నారు.. అయితే.. రాచకొండ కీసర పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. హైదరాబాద్ నల్లకుంట ప్రాంతానికి చెందిన పెట్రిమ్ గిరిధర్ ముంబై, హైదరాబాద్లలో ఆటో మొబైల్ ట్రాన్స్పోర్ట్స్ల్లో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేశాడు. కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీయల్ ఆయిల్ ట్రేడింగ్ను కూడా చేశాడు. దీని కోసం గిరిధర్ సొంతంగా శ్రీనిధి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను రిజిస్టర్ చేశాడు. వీటిలో ఎలాంటి లాభాలు రాకపోవడంతో ఆయిల్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటుకు సిద్ధమయ్యాడు. దీని కోసం కర్నాటకు చెందిన అనిల్ పిరాజీ, లక్నోకు చెందిన గ్యాంటీ మల్టీ సర్వీసెస్ సంస్థ ఎం.చంద్రభాన్ సింగ్ను సంప్రదించాడు.
బయో డీజిల్ దందా నడిపిద్దామని ఈ ముగ్గురు పథకం రచించారు. లక్నో నుంచి వారు బయో డీజిల్ను పంపిస్తే.. గిరిధర్ ఆ ఆయిల్ను తాను లీజుకు తీసుకున్న స్థలంలోని గోదాంలో నిల్వ ఉంచుతాడు. అయితే.. ఈ బయో డీజిల్ను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం డీజిల్ ధరలు పెరగడంతో లాజిస్టిక్ కంపెనీలకు చెందిన వారిని ఒప్పించి.. వారికి ఈ బయోడీజిల్ను సరఫరా చేస్తున్నారు. లీటర్కు రూ.30 వరకు తేడా ఉండటంతో లాజిస్టిక్ కంపెనీలు సైతం ఈ బయో డీజిల్పై ఆసక్తి చూపారు. కీసర్ పీఎస్ పరిధిలోని రాంపల్లి దాయర గోదాంలో దాదాపు 90 వేల లీటర్ల బయో డీజిల్ను నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి జాగ్రత్తలు, అనుమతులు లేకుండా వీటిని గిరిధర్ నిర్వహిస్తున్నాడు.
లక్నో నుంచి వచ్చే బయో డీజిల్ను నిల్వ ఉంచే డ్రమ్ముల్లో పోసేందుకు, అదే విధంగా లాజిస్టిక్ సంస్థలకు చెందిన భారీ వాహనాల ట్యాంకర్లలో డీజిల్ను పోసేందుకు మోటర్ పం పులను వినియోగిస్తున్నాడు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ అయినా… నిప్పు రవ్వ పడినా పేలుడు జరిగి భారీగా నష్టం జరిగేదని పోలీసులు గుర్తించారు. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నాడని నిర్ధారించారు. దీంతో గిరిధర్పై పేలుడు పదార్థాల యాక్ట్తో పాటు మరికొన్ని ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేసి శనివారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దందాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ గోదాంనుడీసీపీ రక్షిత మూర్తి పరిశీలించారు. ఈ దందాను బయటపెట్టిన ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ బృందాన్ని అభినందించారు.