హ్యూస్టన్, జూలై 11: అంతరిక్ష పర్యాటకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే క్రతువులో కీలక ముందడుగు పడింది. వినువీధిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం పంపించిన మానవసహిత వ్యోమనౌక ‘వీఎస్ఎస్ యూనిటీ-22’ ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లిన వాణిజ్య ప్రయోగంగా యూనిటీ-22 రికార్డు సృష్టించింది. మిషన్లో ప్రయాణించిన ఆరుగురు వ్యోమగాముల్లో ‘వర్జిన్ గ్రూప్’ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్తో పాటు తెలుగింటి ఆడపడుచు శిరీష బండ్ల (34) కూడా ఉన్నారు. దీంతో ఆకాశవీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడింది. ఈ మిషన్ సక్సెస్తో రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసియానం చేసిన నాలుగో భారత సంతతి వ్యక్తిగా, మూడో భారత సంతతి మహిళగా శిరీష రికార్డు సృష్టించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ప్రయోగం.. వాతావరణ ప్రభావం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. న్యూమెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్పోర్ట్ అమెరికా’ లాంచింగ్ సెంటర్ నుంచి మొదలైన ఈ రోదసి యాత్ర.. దాదాపు 70 నిమిషాల పాటు కొనసాగింది. అంతరిక్షయానం చేసిన వ్యోమగాములు రాత్రి 9.20 గంటల ప్రాంతంలో (భారత కాలమానం) సురక్షితంగా తిరిగి భూమికి చేరుకున్నారు. రోదసిలో దాదాపు ఐదు నిమిషాల పాటు భారరహిత స్థితిలో ఉండి పుడమి అందాలను వీక్షించారు.
తెలుగు కీర్తి పతాక!
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించిన శిరీష.. తల్లిదండ్రులతో పాటు హ్యూస్టన్లో స్థిరపడ్డారు. పుర్డ్యూ యూనివర్సిటీలో డిగ్రీ, జార్జ్టౌన్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. వర్జిన్ గెలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. మిషన్లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడంతో గుంటూరులో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
కొత్త అంతరిక్ష యుగానికి నవోదయం. ఇదో జీవితకాల అనుభవం. అద్భుతమైన నా బృంద సభ్యులకు అభినందనలు. 17 ఏండ్ల శ్రమ, కష్టానికి ఈ విజయం తార్కాణం -బ్రాన్సన్
బ్రాన్సన్ మూలాలు కూడా ఇక్కడే!
స్పేస్ టూరిజానికి పునాదివేసిన బ్రిటిష్ పారిశ్రామికవేత్త, ‘వర్జిన్ గ్రూప్’ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ మూలాలు భారత్కు చెందినవేనని 2019లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనే స్వయంగా తెలిపారు. డీఎన్ఏ పరీక్షలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. తన తాతమ్మకు తాతమ్మ అయిన ఆరియా తమిళనాడుకు చెందినవారేనని, 1793లో కడలూరులో ఆమె నివసించినట్టు తెలిపారు. భారతీయులను కలిసిన ప్రతీసారి..‘బహూశా మనం బంధువులం అవుతామేమో’ అని వారితో చెబుతానని బ్రాన్సన్ పేర్కొన్నారు.
వచ్చేవారం‘అమెజాన్’ ప్రయోగం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అనుబంధ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ఈ నెల 20న ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌకను రోదసిలోకి పంపనున్నది. అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్తో కలిసి మొత్తం ఆరుగురు ప్రయాణించనున్నారు. 10-25 నిమిషాల పాటు రోదసిలో గడుపనున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు మొదలవ్వాల్సిన ఈ యాత్ర గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. 90 నిమిషాల పాటు జరుగాల్సిన రోదసియానం 70 నిమిషాల్లో పూర్తయింది.