న్యూ మెక్సికో : వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందం వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి బండ్ల శిరీష సహా ఆరుగురు వ్యోమగాములతో న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక రోదసీలోకి పయనమైంది. దాదాపు గంట తర్వాత వ్యోమనౌక రోదసిలో ప్రయాణించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.
అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తెలుగమ్మాయి..
తెలుగమ్మాయి బండ్ల శిరీష అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రోదసియానం చేసిన నాలుగో భారతీయురాలు ఆమె నిలిచింది. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత శిరీష ఈ ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నారు. శిరీష 2015లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్గా వర్జిన్ గెలాక్టిక్లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. ఈ మధ్యే 747 ప్లేన్ ఉపయోగించి అంతరిక్షంలోకి శాటిలైట్ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్టన్ ఆపరేషన్స్ను కూడా చూసుకుంటోంది. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, జార్జ్టౌన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.