ముంబై: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు అతడు. కానీ తొలి మ్యాచ్లో అతని వల్ల కాదనుకున్నాడేమోగానీ కనీసం స్ట్రైక్ ఇవ్వలేదు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్. అయితే తర్వాతి మ్యాచ్లో తానేంటో, తాను ఎందుకంత ధర పలికానో నిరూపించాడు క్రిస్ మోరిస్. రాయల్స్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆశలు లేని స్థితిలో తన సౌతాఫ్రికా టీమ్ మేట్ డేవిడ్ మిల్లర్ అద్భుత పోరాటం నుంచి స్ఫూర్తి పొందిన మోరిస్.. చివర్లో మిగిలిన పని పూర్తి చేశాడు. కేవలం 18 బంతుల్లో 36 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.
ఇందుకేనా అతన్ని 16 కోట్లకుపైగా పెట్టి కొన్నది అని తొలి మ్యాచ్ తర్వాత అన్న వాళ్లే.. ఇప్పుడు మోరిస్ ఆట చూసి ఫన్నీ మేమ్స్తో ట్విటర్ను నింపేస్తున్నారు. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందున్నాడు. మొన్నటి మ్యాచ్, ఇప్పటి మ్యాచ్ ఫొటోలను అతడు షేర్ చేస్తూ.. మొన్న పైసల్ వచ్చినయ్ కానీ ఇజ్జత్ రాలేదు.. ఇప్పుడు పైసల్ వచ్చినయ్.. ఇజ్జత్ కూడా అని వీరూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అతనిలాగే మిగతా నెటిజన్లు కూడా మేమ్స్తో మోరిస్ ఇన్నింగ్స్ను ఆకాశానికెత్తారు.