నగరంలో వేగంగా నాలాల పూడికతీత పనులు
ప్రత్యేకంగా 12 బృందాల ఏర్పాటు
క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యవేక్షణ
వరంగల్, జూన్ 10 : నగరానికి మళ్లీ ముంపు ముప్పు రాకుండా గ్రేటర్ అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే వారంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉండడంతో ముంపు నివారణ చర్యలను వేగవంతం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం నాలాల్లో చెత్త పేరుకపోవడమేనని గుర్తించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టారు. నాలాలలో పాటు బాక్స్ డ్రైనేజీల పూడిక తీత పనులను సైతం గురువారం నుంచి మొదలుపెట్టారు. కమిషనర్ పమేలా సత్పతి క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. పనుల కోసం ప్రత్యేకంగా 12 బృందాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొదించారు. మరోవైపు డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం సన్నద్ధం చేశారు. ఇప్పటికే మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
రైల్వే అధికారుల అనుమతులు తీసుకోవాలి
రైల్వే ట్రాక్ వెంట ఉన్న డ్రైనేజీల పూడికతీత పనుల కోసం రైల్వే అధికారుల అనుమతులు వెంటనే తీసుకోవాలని అధికారులను కమిషనర్ అదేశించారు. హంటర్రోడ్లోని 12 మోరీల పూడికతీత పనులను పరిశీలించిన ఆమె, రైల్వే శాఖ పరిధిలోని డ్రైనేజీలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 12 మోరీల నుంచి సరోజ టాకీస్ వరకు గల నాలా పూడికతీత నాలుగేళ్లుగా చేపట్టకపోవడంతో శాంతినగర్, శివనగర్, పాంతాలు ముంపునకు గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. రైల్వే ట్రాక్ వెంట ఉన్న నాలా చెత్త, చెట్లతో నిండి ఉండడంతో నీటి పారుదల లేదన్నారు. వెంటనే రైల్వే అధికారుల అనుమతులు తీసుకొని క్లీన్ చేసే ప్రక్రియ చేపట్టాలన్నారు. గతేడాది దర్గా కాజీపేట లోకో షెడ్ వద్ద రైల్వే అధికారుల అనుమతులతో నాలా పూడిక తీయడంలో సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.
12 ప్రత్యేక బృందాలు
డివిజన్న్లలో పూడికతీత, పారిశుధ్య పనుల పర్యవేక్షణకు 12 బృందాలు పనిచేస్తున్నాయి. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం సిబ్బందిని బృందాల్లో నియమించారు. ఏఈ, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ను ఒక్కో బృందంలో నియమించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ఎస్ఈ, చీఫ్ ఎంహెచ్వో, డీఎఫ్వోలతో టాస్క్ఫోర్స్ కమిటీ వేశారు.
చకచకా పనులు
నయీంనగర్, భద్రకాళి, బొందివాగు, శాకరాశికుంట నాలాలు, 12 మోరీల పూడికతీత పనులు చకచకా కొనసాగుతున్నాయి. వింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. కాలనీల్లో వరద నీరు వచ్చి చేరినా నిల్వ ఉండకుండా కాల్వల తవ్వకాలు చేపడుతున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో అనేక కాలనీల్లో గ్యాంగ్ వర్క్ చేస్తున్నారు.