కరీంనగర్ : పేద కుటుంబాలు తమ కుమార్తెలకు వివాహం చేసుకోవడంలో సాయం చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో 260 మంది లబ్ధిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్రానంతరం దేశం చాలా మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను చూసింది. కానీ ఏ ఒక్కరూ కూడా పేద కుటుంబాలలోని అమ్మాయిల వివాహానికి సహాయం చేయాలని అనుకోలేదు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాత్రమే ఇటువంటి ఆలోచన చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అమ్మాయిల పెండ్లి చేసేందుకు పేద తల్లిదండ్రులు తమకున్న కొద్దిపాటి ఇండ్లను, జాగలను తనఖా పెట్టేవారు. కల్యాణలక్ష్మి పథకం ప్రవేశంతో పరిస్థితి మారిపోయిందన్నారు. తెలంగాణలో బలహీన, అణగారిన వర్గాల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించారన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సీఎం కేసీఆర్ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లుతో పాటు ఇతర సంక్షేమ పథకాలు ఎటువంటి విరామం లేకుండా కొనసాగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.