సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): కొరియర్ బాయ్పై ఫిర్యాదు చేయాలనుకున్న ఓ మహిళ… కస్టమర్ కేర్ కోసం గూగుల్ సర్చ్ చేసి.. సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ. 2 లక్షలు పోగొట్టుకుంది. బంజారాహిల్స్కు చెందిన ఓ మహిళకు కొరియర్ వచ్చింది… కొరియర్ బాయ్ రూ. 300 ఎక్కువగా తీసుకున్నాడు… ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కస్టమర్కేర్ నంబర్ కోసం గూగుల్ సర్చ్ చేసి.. అందులోని ఓ నంబర్కు ఫోన్ చేసింది.. తాము కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ ఒక లింక్ పంపించారు. ఆ లింక్ను క్లిక్ చేయడంతో ఆమె ఖాతాలో నుంచి రూ. 99 వేలు మాయమయ్యాయి. వెంటనే ఆమె మళ్లీ ఆ ఫోన్కు ఫోన్ చేయగా..పొరపాటు జరిగినట్లుంది.. ఇంకో ఖాతా నంబర్ ఇవ్వండి.. దానికి మొత్తం డబ్బులు బదిలీ చేస్తామంటూ నమ్మించగా.. పంపించింది. మరో సారి ఆమె ఖాతాలో నుంచి రూ. లక్ష కాజేశారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరో ఘటనలో ఉస్మానియాలో ల్యాబ్టెక్నీషియన్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి అతని ప్రమేయం లేకుండానే రూ. 1.2 లక్షలు మాయమయ్యాయి.
మైన్స్ అండ్ జియోలజీ డైరెక్టర్ పేరుతో అన్ని జిల్లాల్లోని అసిస్టెంట్ డైరెక్టర్లకు డైరెక్టర్మెయిల్5001<\@>జీమెయిల్ అనే పేరుతో సైబర్నేరగాళ్లు మెయిల్ పంపించారు. ఈ మెయిల్కు నిజామాబాద్కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ స్పందించి, ఎస్ సార్ అంటూ సమాధానం పంపించాడు. దీంతో అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కొనాలంటూ మరో మెయిల్ పంపించారు. రెండు సార్లు ఆ మెయిల్ రావడంతో సుమారు రూ. 40 వేలు పెట్టి ఆయన కూపన్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన మెయిల్ గురించి ఆరా తీయగా అది నకిలీదని తేలింది. దీంతో ఆ అధికారి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ.. తన తల్లి కొవిడ్తో బాధపడుతుండగా మందుల కోసం ఆన్లైన్లో బుక్చేసి… రూ. 1.6 లక్షలు చెల్లించింది.. మరుసటి రోజు ఆమె తల్లి చనిపోయింది. దీంతో మందులు వద్దు.. తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సదరు ఆన్లైన్ సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేయగా.. డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మించి.. ఫోన్ స్విచాఫ్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.