లండన్: కోవిడ్ వ్యాక్సిన్ల కొరత పేద దేశాలను పీడిస్తున్నది. సుమారు 60 పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయింది. ఆయా దేశాలకు సాయం చేస్తానన్న దేశాలన్నీ జూన్ వరకు కోవిడ్ టీకాలను బ్లాక్ చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న కోవాక్స్ ప్రోగ్రామ్కు బ్రేక్ పడింది. దిగుమ ఆదాయ దేశాలకు గత వారంలో రెండు సార్లు మాత్రమే 25 వేల డోసుల చొప్పున సరఫరా చేసింది. సోమవారం నుంచి దాదాపు పేద దేశాలకు టీకా సరఫరా నిలిచిపోయింది. మరోవైపు యునిసెఫ్ డేటా ప్రకారం.. 92 దేశాలకు సుమారు 20 లక్షల కోవాక్స్ డోసులు పంపిణీ అయినట్లు తెలుస్తోంది. కోవిడ్19 టీకాల సరఫరాలో అసమానతలు షాకింగ్కు గురి చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం వెల్లడించింది. ధనిక దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి టీకా అందగా.. పేద దేశాల్లో ప్రతి 500 మందిలో ఒకరికే టీకా అందినట్లు టెడ్రోస్ తెలిపారు.
వ్యాక్సిన్ కొరతకు భారత్ ప్రధాన కారణంగా నిలుస్తోంది. అత్యధిక స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ ఎగుమతి నిలిపివేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఆస్ట్రాజెనికా టీకాలను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవాక్స్ ప్రోగ్రామ్లో భాగమైన దేశాలకు కొన్నింటికి ఇంకా టీకాలు అందలేదు. దీంతో ఆయా పేద దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల రెండవ డోసు డెలివరీకి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ టీకా సరఫరా ఆలస్యం వల్ల సుమారు 60 పేద దేశాలకు ప్రభావం ఉంటుందని జీఏవీఐ పేర్కొన్నది. కోవాక్స్ ప్రయత్నాలకు విఘాతం ఏర్పడుతున్న నేపథ్యంలో.. రష్యా, చైనా టీకాలను పేద దేశాలకు పంపాలని డబ్ల్యూహెచ్వో భావిస్తున్నది. కానీ ఈ రెండు దేశాల టీకాలకు ఇంకా యూరోప్ దేశాల రెగ్యులేటర్ల నుంచి అనుమతి రాలేదు. ఏప్రిల్ చివరినాటికి చైనా వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడింది.