వాషింగ్టన్: సర్జరీ సమయంలో ఏడ్చినందుకు ఒక మహిళకు ఆసుపత్రి బిల్లులో భావోద్వేగం పేరుతో స్వల్పంగా చార్జ్ చేశారు. ఆ మహిళ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. సాధారణంగా ఆసుపత్రి అన్నా, అందులోనూ శస్త్రచికిత్స అన్నా రోగులు భయాందోళన చెందుతారు. అమెరికాకు చెందిన మిడ్జ్ అనే ట్విట్టర్ యూజర్ ఇటీవల తన శరీరంపై ఉన్న మచ్చను తొలగించుకునేందుకు సర్జరీ చేయించుకున్నారు. కాగా, శస్త్రచికిత్స సమయంలో ఆమె కొంచెం ఏడ్చారు.
అయితే ఆసుపత్రి బిల్లులో దీనికి కూడా చార్జ్ చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. సర్జరీ సమయంలో స్వల్ప భావోద్వేగం పేరుతో 11 డాలర్లు (సుమారు రూ.817) బిల్లులో వేశారు. దీంతో మోల్ తొలగించినందుకు 223 డాలర్లు, ఏడ్చినందుకు అదనపు చార్జీ అంటూ సంబంధిత సర్జరీ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు.
కాగా, సెప్టెంబర్ 29న పోస్ట్ చేసిన ఈ ఆసుపత్రి బిల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు విభిన్నంగా దీనిపై స్పందించారు. అమెరికా ఆరోగ్య రంగంపై కొందరు విమర్శలు చేశారు. తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను మరి కొందరు పంచుకున్నారు.