కాబూల్: అమెరికా 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి చివరి అమెరికా సైనికుడు కూడా కాబూల్ను వీడాడు. అయితే ఆ దేశం విడిచి వెళ్లే ముందు అక్కడ తాము విడిచి పెట్టిన అనేక ఎయిర్క్రాఫ్ట్, సాయుధ వాహనాలు, ఆయుధాలను అమెరికా సైనికులు పని చేయకుండా చేయడం గమనార్హం. వాళ్లు అలా వెళ్లిపోయారో లేదో కాబూల్ ఎయిర్పోర్ట్ హ్యాంగర్లోకి అడుగుపెట్టిన తాలిబన్లు అక్కడే ఉన్న చినూక్ హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ ట్విటర్లో షేర్ చేశారు.
ఎన్నో ఎయిర్క్రాఫ్ట్లు, సాయుధ వాహనాలు, హైటెక్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్లను అమెరికా సైన్యం పని చేయకుండా చేసినట్లు ఏఎఫ్పీ వెల్లడించింది. అయితే సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ ప్రకారం.. 73 ఎయిర్క్రాఫ్ట్లను, 27 హమ్వీలను డీమిలిటరైజ్ చేశారు. ఈ ఎయిర్క్రాఫ్ట్లు ఇక ఎప్పటికీ ఎగరలేవు. ఎవరూ వాటిని వినియోగించలేరు అని మెకంజీ చెప్పారు. అమెరికా సైన్యం కాబూల్ను వీడే ముందు చేసిన అతి ముఖ్యమైన పని కౌంటర్ రాకెట్, ఆర్టిలరీ, మోర్టార్ వ్యవస్థను పని చేయకుండా చేయడమే. 70 ఎంఆర్ఏపీ సాయుధ వాహనాలను కూడా అమెరికా ఇక్కడే వదిలేసి వెళ్లింది. ఇది ఒక్కొక్కటి 10 లక్షల డాలర్ల విలువ చేసేది.