హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఉపఎన్నిక వేళ నాగార్జునసాగర్లో బీజేపీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కడారి అంజయ్యయాదవ్ బీజేపీని వీడి.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంగళవారం సీఎం కేసీఆర్.. అంజయ్యయాదవ్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు గిరిజనమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబూరావు నాయక్, గుర్రంపోడు మాజీ ఎంపీపీ రామచంద్రం, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్నాయక్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో నాయకులకు గౌరవం
రాష్ర్టానికి బీజేపీ ఏదో చేస్తుందని ఆశించామని కానీ, ఆశలు అడియాసలే అయ్యాయని టీఆర్ఎస్లో చేరిన నేతలు తెలిపారు. పార్టీలో నాయకులకు గౌరవం లేదని, కష్టపడేవారికి గుర్తింపు లేదని వాపోయారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని నిర్ణయించుకున్నామని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీసుకొస్తామని అంజయ్య యాదవ్ ధీమాగా చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒంటెద్దుపోకడలో ఉన్నదని, పార్టీ కోసం పనిచేసేవారిని నిర్లక్ష్యం చేస్తున్నదని, రాష్ట్రంలో బీజేపీ కనుమరుగయ్యేరోజు ఎంతోదూరంలో లేదని పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కు టికెట్ ఇచ్చి సీఎం కేసీఆర్ ఎంతో సానుభూతిచూపారని.. టీఆర్ఎస్లో కార్యకర్తలు, నాయకులకు దక్కుతున్న గౌరవం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన కడారి అంజయ్య యాదవ్ 27,858 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సాగర్ స్థానం కాంగ్రెస్కు కేటాయించడంతో ఆయన పోటీచేయలేదు. కాగా, సాగర్ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలు పలువురు ఈ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
బెడిసి కొట్టిన బీజేపీ వ్యూహం
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ వ్యూహం బెడిసి కొట్టింది. టీఆర్ఎస్లో అసంతృప్తులు ఉంటే.. ఆకర్షించాలని ఆశించిన బీజేపీకి ఆశాభంగమే ఎదురైంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కు టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణులన్నీ ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. భగత్కు బీఫారం అందజేత నుంచి నామినేషన్ దాఖలు, ప్రచారం దాకా స్థానిక నాయకత్వం ఒక్కతాటిపై నడుస్తున్నది. మరోపక్క బీజేపీ టికెట్ కేటాయింపుతోనే పార్టీలో చిచ్చురేగింది. డాక్టర్ రవికుమార్కు టికెట్ ఇవ్వడంతో పార్టీలో తీవ్రస్థాయిలో అసంతృప్తులు పెల్లుబికింది. ఇదే సమయంలో పులిమీదపుట్రలా లంబాడాలను ఎస్టీల జాబితానుంచి తొలగించాలని కోరుతూ, బీజేపీ ఎంపీ సోయం బాపూరావు గతంలో ప్రధాని మోదీని కలిసిన ఫొటో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టడం లంబాడాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ ఉదంతం సాగర్లో బీజేపీ నాయకత్వాన్ని ఇరుకున పడేసింది.
ఇవీ కూడా చదవండి
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?