వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గతేడాది కూడా అమెరికాను చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.
గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచే ఉన్నట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 1,49,788 ఇన్ఫెక్షన్లు బయటపడగా.. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది.
అలాగే, తాజాగా మరో 668 మంది మృతి చెందగా ఇప్పటివరకు కొవిడ్ కాటుకు బలైపోయినవారి సంఖ్య 6.14 లక్షలకు చేరింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియెంట్ వ్యాప్తి చెందడమే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ కేసుల పెరుగుదలతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత జోరందుకుంది. గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మందికి టీకా ఇచ్చినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.