రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధం
జెండా ఆవిష్కరించనున్న మంత్రి గంగుల
కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏడో ఆవిర్భావ వేడుకలకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఈ యేడు సాదాసీదాగా నిర్వహించాలని సర్కారు ఆదేశించగా, ఈ మేరకు యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో గంగుల, జగిత్యాలలో కొప్పుల, పెద్దపల్లిలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి జెండా ఆవిష్కరించనుండగా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఈ యేడు సాదాసీదాగా వేడుకలు నిర్వహించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
పెద్దపల్లిలో ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి హాజరు కానున్నారు. ఉదయం 8.45గంటల నుంచి 8.50గంటల వరకు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. అనంతరం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని అక్కడ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకు గాను ఐటీఐ గ్రౌండ్లోని పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమ షెడ్యూల్ను రూపొందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఉదయం 9.15 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పది గంటలకు ఆర్డీవో కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను పరిశీలించి, అనంతరం 10.30 గంటలకు సర్దాపూర్లోని పోలీస్ బెటాలియన్, మార్కెట్ యార్డులను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్కు తిరుగు పయనంకానుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ముందుగా తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లో జెండా ఆవిష్కరిస్తారు. కరోనా నేపథ్యంలో కార్యక్రమాలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రితో పాటు జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, కలెక్టర్ కే శశాంక, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే అనుమతి ఉన్నదని అధికారులు తెలిపారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే మంత్రి గంగుల ప్రెస్నోట్ విడుదల చేసే అవకాశం ఉంది.
జగిత్యాలలో ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరుకానున్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అవతరణ వేడుకల నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి, అన్ని ఏర్పాట్లు చేశారు.