వాషింగ్టన్: ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అమెరికా కొత్త కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలతో ఆకస్ను ఏర్పాటు చేశారు. ఆ కూటమిలో బ్రిటన్ తన వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గాముల టెక్నాలజీని ఆస్ట్రేలియాకు ఇవ్వనున్నది. అయితే ఈ కూటమిలో ఇండియా లేదా జపాన్ దేశాలను చేర్చేదిలేదని అమెరికా స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15వ తేదీన ఆకస్ గ్రూపును బైడెన్ ప్రకటించారని, ఈ గ్రూపులో మరో దేశాన్ని చేర్చుకోవడం లేదని ఫ్రాన్స్కు బైడెన్ స్పష్టంచేశారని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియా సమావేశంలో తెలిపారు.
ప్రస్తుతం న్యూయార్క్లో జరుగుతున్న క్వాడ్ సమావేశాల్లో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు వస్తున్నారు. క్వాడ్ గ్రూపులో ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. క్వాడ్ మీటింగ్కు అమెరికా ఆతిధ్యం ఇస్తున్న నేపథ్యంలో ఆకస్ గ్రూపుపై చర్చ వస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంత గ్రూపులో తమను చేర్చుకోకపోవడం పట్ల ఫ్రాన్స్ విమర్శలు చేసింది. ఆకస్ గ్రూపుపై ప్రశ్న వేసిన సమయంలో జెన్ స్పందిస్తూ.. ఆకస్ ఏమైనా జాకస్ లేదా జైకస్ అవుతుందా అని ఆమె జోక్ చేశారు. వాస్తవానికి చైనా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్, ఆసీస్ దేశాలు ఆకస్ గ్రూపును క్రియేట్ చేశాయి.