న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీ.. వైట్హౌజ్ భేటీలో జోకులేసుకున్నారు. ఇండియాలో అయిదుగురు బైడెన్లు ఉన్నారంటూ జో బైడెన్ చేసిన కామెంట్కు ప్రధాని మోదీ స్పందిస్తూ.. వారికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకువచ్చినట్లు చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య చిరనవ్వులు పూశాయి. మోదీ, బైడెన్ మధ్య తొలిసారి ప్రత్యక్ష భేటీ జరిగింది. ఓవల్ ఆఫీసులో జరిగిన భేటీలో ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడారు. ఇండియాలో అయిదుగురు బైడెన్లు ఉన్నారని, ఒకరు భారతీయ మహిళను పెళ్లి చేసుకున్నట్లు జో బైడెన్ జోకేశారు. అయితే అదే బాటలో రియాక్ట్ అయిన మోదీ.. బైడెన్ వారసులకు సంబంధించిన డాక్యుమెంట్లతో వచ్చినట్లు చెప్పారు.
1972లో 28 ఏళ్ల వయసులో తాను తొలిసారి సేనేటర్గా ఎన్నికయ్యానని, ఆ సమయంలో ప్రమాణ స్వీకారానికి ముందు తనకు ముంబై నుంచి ఓ లెటర్ వచ్చిందని, బైడెన్ పేరుతో ఆ లేఖ ఉందని, ఆ వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని జో బైడెన్ అన్నారు. అయితే ఇండియాలో అయిదుగురు బైడెన్లు ఉన్నట్లు ఆ తర్వాత మీడియా చెప్పినట్లు జో గుర్తు చేశారు. తాను జోక్ వేశారని, కెప్టెన్ జార్జ్ బైడెన్ అనే వ్యక్తి ఈస్ట్ ఇండియా టీ కంపెనీలో పనిచేస్తున్నట్లు చెప్పానన్నారు.
కేవలం నవ్వుకోవాలన్న ఉద్దేశంతో జోక్ వేసినట్లు బైడెన్ తెలిపారు. జార్జ్ బైడెన్ ఆనవాళ్లను పసికట్టాలని, మన మీటింగ్ ఉద్దేశం అదే అని బైడెన్ అన్నారు. దీంతో ఓవల్ ఆఫీసులో నవ్వులు పూవాయి. జోక్లు పక్కనపెడితే, ఇండియా, అమెరికా మధ్య బంధం బలమైందని జో అన్నారు. ఇక తన వంతు రాగానే మోదీ మాట్లాడుతూ.. బైడెన్ ఇంటిపేర్ల గురించి మీరు మాట్లాడారని, గతంలోనూ దీని గురించి చెప్పారని, అయితే వారి డాక్యుమెంట్ల కోసం అన్వేషించానని, వారికి సంబంధించిన కొన్ని దస్త్రాలు దొరికాయని, ఆ పేపర్లు మీకేమైనా ఉపయోగపడుతాయేమోనని మోదీ అన్నారు. దీంతో జో బైడెన్ నవ్వును ఆపుకోలేకపోయారు.
భారత్లో తమ పూర్వీకులు ఉన్నారన్న అంశంపై గతంలోనూ ఓ సారి జో బైడెన్ గుర్తు చేశారు. ముంబైలో దూరపు బంధువులు ఉన్నట్లు ఆయన తెలిపారు. 2013లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ముంబై విజిట్ చేశారు. తమ బంధువుల గురించి ఆరా తీయాలంటూ ఆ సమయంలో ఆయన అన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ముంబైలో అయిదుగురు బైడెన్ల ఉన్నట్లు జో తెలిపారు. తమ ముత్తాత జార్జ్ బైడెన్ ఇండియాలో సెటిలయ్యారని, ఆయన భారతీయ మహిళను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.