వాషింగ్టన్: అమెరికా చేపట్టిన అతి సుదీర్ఘ యుద్ధాన్ని అంతం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ దళాలను ఉపసంహరించనున్నట్లు ఆయన తెలిపారు. దళాలు వెనక్కి వచ్చినా ఆ దేశానికి తమ మద్దతు ఉంటుందన్నారు. కానీ అది సైనిక సాయం కాదన్నారు. వైట్హౌజ్ నుంచి మాట్లాడిన బైడెన్.. అమెరికాపై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్ల కావస్తున్న తరుణంలో అతి సుదీర్ఘ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు చెప్పారు. 2001 సెప్టెంబర్లో అమెరికాపై ఉగ్రవాదులు వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. సుమారు 3500 మంది అమెరికా సైనికులు ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. మే ఒకటో తేదీ నుంచి అమెరికా దళాలు ఉపసంహరణ మొదలుపెట్టనున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆ ప్రక్రియ పూర్తికానున్నది. దళాల ఉపసంహరణ అంశంపై అధ్యక్షుడు బైడెన్తో ఫోన్లో మాట్లాడినట్లు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తెలిపారు. ఆఫ్ఘన్ రక్షణ దళాలు తమ ప్రజల్ని సంపూర్ణంగా రక్షించుకునే సామర్థ్యం ఉందన్నారు.