న్యూఢిల్లీ: లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన వివాదాస్పద నిబంధనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రేక్ వేస్తారా? స్థానిక ప్రతినిధులను సంప్రదించకుండా వాటిని అమలు చేయబోమని అమిత్ షా హామీ ఇచ్చినట్టు లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పటేల్ ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని హోంమంత్రికి చెప్పనట్టు ఫైజల్ వివరించారు. అంతేకాకుండా పటేల్ను పరిపాలనాధికారి పదవి నుంచి తొలగించాలని కోరినట్టు చెప్పారు. బీఫ్ అమ్మకం నిషేధించడం మొదలుకుని మద్యం అమ్మకాలను అనుమతించడం వరకు పటేల్ స్థానికులకు ఇబ్బంది కలిగించే అనేక కొత్త నిబంధనలను ప్రకటించారు. అంతేకాకుండా స్థానికులు తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే వారిని జైళ్లల్లో పెట్టేందుకు గూండా యాక్టు కూడా తెచ్చారు.