అమరావతి : ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాష్టారు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంకట రామ సుబ్రహ్మణ్మేశ్వరరావు.. కారా మాష్టారుగా సుపరిచితులు. వయోభారంతో కొంతకాలంగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. వృత్తరీత్యా ఆయన ఉపాధ్యాయుడు కాగా.. సామాన్య పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేశారు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్.. రామారావు రచనల నుంచి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవారు. ఈయన చేసిన రచనలు తక్కువైనా ప్రాచుర్యం పొందాయి. 1966లో ఆయన వ్రాసిన ‘యజ్ఞం’ కథలు తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందాయి. దోపిడీ స్వరూప స్వభావాలను సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించగా.. 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
కారా మాస్టారుగా పేరొందిన ‘కాళీపట్నం రామారావు’ 1924, నవంబరు 9న శ్రీకాకుళంలో లావేరు మండలం మురపాకలో జన్మించారు. శ్రీకాకుళంలో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు. భీమిలిలో సెకెండరీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1948 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో చేరి.. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో ఆయన కథా నిలయాన్ని స్థాపించారు. ఆయన రచించిన ‘యజ్ఞం’ కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. అలాగే పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్స్ పొందారు. ఆయన మృతిపై పలువురు రచయితలు సంతాపం ప్రకటించారు.