హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆయన ప్రగతిభవన్కు వచ్చారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిగాయి. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఎల్ రమణ మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్ను కలిసి, జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు. దేశంలో వివిధ రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్ విడమరచి చెప్పారని ఆయన తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పాలనా సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. కొవిడ్ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని కితాబిచ్చారు.
పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చేనేత రంగాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం పురోగమిస్తున్న ఈ తరుణంలో తనలాంటి వాళ్లు టీఆర్ఎస్లో ఉంటే బావుంటుందని స్వయంగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారని, తాను సానుకూలంగా స్పందించానని రమణ వెల్లడించారు. తన 27 ఏండ్ల రాజకీయ జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన తన నేపథ్యాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తుచేయడం గొప్ప విషయంగా ఆయన పేర్కొన్నారు. తన నేపథ్యాన్ని, అనుభవాన్ని అర్థం చేసుకొని ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, అధికారపక్షంలో ఉండి, ముందుకెళ్తానని ప్రకటించారు. తన శ్రేయోభిలాషులతో చర్చించి, రెండు మూడ్రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
రెండుమూడ్రోజుల్లో టీటీడీపీ విలీనం : మంత్రి ఎర్రబెల్లి
రెండు మూడ్రోజుల్లో రమణ టీఆర్ఎస్లో చేరతారని, తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ.. కష్టపడి రాజకీయాల్లో రాణించి, ప్రజల మన్ననలు పొందారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లెటర్ ఇవ్వటంలో తనతోపాటు రమణ కృషి ఉన్నదని చెప్పారు. అట్టడుగువర్గాల నుంచి ఎదిగిన రమణ పట్ల సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉన్నదని వెల్లడించారు. నీతి, నియమాలకు కట్టుబడి ఉండే రమణ సేవలు పార్టీకి అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఆహ్వానించగానే రమణ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు లేదని, ఇంకా అక్కడక్కడ ఉన్న ఆ పార్టీ శ్రేణులు టీఆర్ఎస్లో విలీనం అవుతాయని వెల్లడించారు.