కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా, నాటో సేనల శకం ముగిసింది. అగ్రరాజ్య బలగాలు నిన్న ఆ దేశాన్ని వీడివెళ్లాయి. ఆఫ్ఘన్లో 20 ఏళ్ల యుద్ధానికి అమెరికా ఫుల్స్టాప్ పెట్టింది. అయితే కాబూల్ విమానాశ్రాయాన్ని ఇప్పుడు తాలిబన్ ఫైటర్లు ( Taliban Fighters ) ఆక్రమించేశారు. తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్.. ఎయిర్పోర్ట్లో ఫైటర్లను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా ఓటమి.. ఆక్రమణదారులకు గుణపాఠం అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణలో ఓటమి పాలైన అమెరికాకు ఇదో పెద్ద గుణపాఠమని, భవిష్యత్తు తరాలకు కూడా ఆక్రమణదారులకు ఇదో లెసన్గా మిగిలుతుందని జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.
ఆర్మీ దస్తులు ధరించి ఆయుధాలతో ఉన్న ఫైటర్లను ఉద్దేశిస్తూ కాబూల్ విమానాశ్రయంలో జబీహుల్లా మాట్లాడారు. వారి త్యాగాలను ప్రశంసిస్తూ వారికి థ్యాంక్స్ చెప్పారు. స్వాతంత్య్రాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. మీ పోరాటం, మన నేతల బలిదానం వల్లే ఈ విజయం సాధమైందని జబీహుల్లా తెలిపారు. మీకు, దేశ ప్రజలకు కంగ్రాట్స్ చెబుతున్నానని, మళ్లీ మన దేశాన్ని ఎవరూ ఆక్రమించరని భావిస్తున్నాని తెలిపారు. శాంతి, సామరస్యంతో పాటు నిజమైన ఇస్లామిక్ వ్యవస్థ ఏర్పాటు కావాలన్నారు.
ఆఫ్ఘన్ ప్రజలతో చాలా వినమ్రంగా వ్యవహరించాలని ఆయన తాలిబన్ ఫైటర్లను కోరారు. దేశ ప్రజలకు మనం సేవకులుగా మారాలన్నారు.