వర్ధన్నపేట, మే 10 : కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని డీఎంహెచ్వో చల్లా మధుసూదన్ అన్నారు. మండల కేంద్రంలోని సీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు ఉన్నవారు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. లక్షణాలు ఉంటే వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. ఇంటి వద్ద వసతులు లేకపోతే ఐసొలేషన్ కేంద్రానికి రావాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహస్వామి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మనోధైర్యమే దివ్య ఔషధం..
రాయపర్తి : కరోనా వ్యాధిగ్రస్తులు మ నోధైర్యంతో ఉంటే ఆరోగ్యం త్వరితగతిన మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుందని పెర్కవేడు గ్రామ సర్పంచ్ చిన్నాల తారాశ్రీ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో సోమవారం గ్రామంలోని కరోనా బాధితుల ఇండ్లను సందర్శించారు.
లక్షణాలు ఉంటే ఆలస్యం చేయొద్దు
పరకాల : కరోనా లక్షణాలు ఉంటే టెస్టుల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే మందులు వాడడం ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ తిరుణహరి శేషాంజన్ స్వామి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరం, తలనొప్పి, విరేచనాలు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే మందులు వాడాలని, అయినా తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలన్నారు. రోజురోజుకూ కరోనా వైరస్ విస్తరిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అన్నారు.