పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో కొత్త రికార్డులు తిరగరాసింది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లైకులు సాధించిన ట్రైలర్ గా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలలో నటించారు. ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ అంజలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
వకీల్ సాబ్ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పింది. ఇందులో తన పాత్ర గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యానని.. ఇలాంటి మంచి కథ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నాను అని చెప్పింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ సెట్లో ఎలా ఉంటాడో అనే విషయంపై కూడా ఓపెన్ అయిపోయింది అంజలి. షూటింగ్ ఉంటే ఓకే.. లేకపోతే కామ్గా ఒక మూలన కూర్చుంటారని.. తన పుస్తకాలే తన ప్రపంచం అని చెప్పుకొచ్చింది అంజలి. లేదంటే పడుకొని విశ్రాంతి తీసుకుంటారని అంజలి చెప్పింది.
ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ఒక సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుందని.. అది చూసి సెట్లో ఉన్న పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టడం తన జీవితంలో మరిచిపోలేని విషయం అంటుంది అంజలి. ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు మరింత పెరుగుతాయని నమ్మకంగా చెబుతోంది ఈ తెలుగమ్మాయి. ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు శ్రుతి హాసన్ కూడా నటిస్తోంది. ఈమె క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి