వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 9.5 బిలియన్ డాలర్ల ఆఫ్ఘన్ ద్రవ్య నిల్వలను స్తంభింపజేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో ఈ చర్య చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాంకుకు చెందిన సుమారు 9.5 బిలియన్ డాలర్ల నిధులను తాలిబన్లు యాక్సెస్ చేయకుండా, ఆ దేశానికి బదిలీ కాకుండా నిరోధించారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్ యెల్లెన్, ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ అధికారులు ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. అమెరికా బ్యాంకుల్లో ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వ ద్రవ్య నిల్వలను స్తంభింపజేయాలని ఆదేశించారు. ఈ చర్య ఫలితంగా, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న, ‘ప్రత్యేక నియమిత జాతీయుల’ జాబితాలో ఉన్న తాలిబన్లు, యుఎస్లో ఉన్న ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను యాక్సెస్ చేయలేరని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.