న్యూయార్క్: 65 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ 19 ఫైజర్ బూస్టర్ టీకా వేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న వారితో పాటు ఎక్కువగా జనం మధ్య తిరిగే ఉద్యోగాలు చేసేవారికి కూడా బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది మంది అమెరికన్లు మూడవ డోసు వేసుకోనున్నారు. రెండవ డోసు వేసుకున్న ఆర్నెళ్ల తర్వాత మూడవ డోసు కోవిడ్ టీకా తీసుకోవాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధినేత జానెట్ వుడ్కాక్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. వ్యక్తిగత నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జానెట్ వెల్లడించారు. అయితే 16 ఏళ్లు దాటిన వారికి కూడా బూస్టర్ టీకా ఇవ్వాలన్న ప్రతిపాదనను నిపుణుల కమిటీ తోసిపుచ్చింది. బూస్టర్ డోసుల అంశంలో అంటువ్యాధుల సంస్థ (సీడీసీ) కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది.