వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై ఆగస్టులో జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై అమెరికా స్పందించింది. ఆ డ్రోన్ దాడి చేసింది తామే అని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఆగస్టు 29వ తేదీన జరిగిన దాడిలో.. ఓ కార్మికుడితో పాటు ఓ ఫ్యామిలీకి చెందిన 9 మంది ఆ దాడిలో మృతిచెందారు. దాంట్లో ఏడు మంది చిన్నారులు కూడా ఉన్నారు. కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అక్కడ బాంబు దాడి జరిగిన కొన్ని రోజులకు అమెరికా దళాలు డ్రోన్ అటాక్ చేశాయి. అంతర్జాతీయ ఎయిడ్ వర్కర్గా ఉన్న ఆ వ్యక్తి కారును అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ట్రాక్ చేశారు. ఐఎస్-కే మిలిటెంట్లకు అతను చెంది ఉంటారని అతను ఉంటున్న ఇంటిపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. ఓ ఇంటి కాంపౌండ్లో ఆ వ్యక్తి కారులో పేలుడు పదార్ధాలు లోడింగ్ చేస్తున్నట్లు డ్రోన్ ద్వారా గుర్తించామని, కానీ వాస్తవానికి అవి వాటర్ బాటిళ్లు అని తేలినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఆ డ్రోన్ దాడి ఓ విషాదకర పొరపాటు అని జనరల్ మెకంజీ తెలిపారు. అయితే ఇంటెలిజెన్స్ సమాచారం అందించిన వారిలో తాలిబన్లు లేరని ఆయన తెలిపారు.