కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశ యూనివర్సిటీలో తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పురుషులు, మహిళా విద్యార్థుల మధ్య కర్టెన్లు ఏర్పాటు చేశారు. మగ, మహిళా విద్యార్థులు చెరో వైపు కూర్చొని ఉండగా వారి మధ్య పరదాలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆఫ్ఘనిస్థాన్లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు హాజరయ్యే మహిళలు తప్పనిసరిగా అబయా వస్త్రాన్ని ధరించాలని, ముఖాన్ని నిఖాబ్తో కప్పుకోవాలని తాలిబన్ ఆదేశించింది. అలాగే మగ, మహిళా విద్యార్థులకు విడివిడిగా లేదా పరదా ద్వారా విభజించి తరగతులు నిర్వహించాలని పేర్కొంది. మహిళల విద్యకు సంబంధించి తాలిబన్ సుదీర్ఘ పత్రం జారీ చేసింది. మహిళా విద్యార్థులకు మహిళలు మాత్రమే బోధించాలని ఆదేశించారు. అది సాధ్యం కాకపోతే మంచి నడవడి కలిగిన వృద్ధులతో బోధించవచ్చని తెలిపింది.
పురుషులు, మహిళలు విడివిడిగా ప్రవేశ, నిష్క్రమణలను ఉపయోగించాలని తాలిబన్ పేర్కొంది. మహిళలు విడిగా చదువుకోవాలని, మగవారితో కలవకుండా ఉండేందుకు ఐదు నిమిషాల ముందుగా పాఠాలు ముగించాలని, మగ విద్యార్థులు వెళ్లేంత వరకు వేచి ఉండే గదుల్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాలిబన్ ఉన్నత విద్యా శాఖ ఒక డిక్రీని జారీ చేసింది.
కాగా, మహిళా విద్యార్థులకు ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ వారు చదువుకునేందుకు తాలిబన్లు అనుమతించడం గొప్ప విషయమని ఆ దేశ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. మగ, మహిళా విద్యార్థులకు వేర్వేరుగా క్లాసులు నిర్వహించేందుకు తగినంత మహిళా బోధకులు, సౌకర్యాలు లేవని చెప్పారు.