న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఉగ్రదాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇచ్చిన ప్రకటనలో తాలిబన్( Taliban ) పేరును తీసేసింది. ఆగస్ట్ నెలలో భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్.. ఈ ప్రకటనపై సంతకం చేసి జారీ చేసింది. గతంలో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన మరుసటి రోజు అంటే ఈ నెల 16న ఆఫ్ఘన్ పరిస్థితులపై సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దేశ భూభాగంలో నుంచి అయినా ఆపరేట్ చేసే ఏ ఉగ్రవాద సంస్థకూ తాలిబన్ లేదా ఏ ఇతర ఆఫ్ఘన్ గ్రూప్ మద్దతివ్వకూడదని ఆ ప్రకటనలో భద్రతా మండలి హెచ్చరించింది. తాజాగా ఈ ప్రకటనలో నుంచి తాలిబన్ పేరును ఎత్తేయడం గమనార్హం.
ఐక్యరాజ్య సమితికి ఇండియా నుంచి శాశ్వత ప్రతినిధిగా ఉన్న సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనలో మార్పు గురించి వెల్లడించారు. ప్రకటనలో నుంచి T పదం వెళ్లిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. దౌత్యంలో 15 రోజుల సమయం అంటే చాలా ఎక్కువ. తాజా ప్రకటనలో T పదం లేదు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆగస్ట్ 16, ఆగస్ట్ 27న జారీ చేసిన ప్రకటనలు చూడండి అని అక్బరుద్దీన్ ఆ ట్వీట్లో చెప్పారు.