హైదరాబాద్, మార్చి 23: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి చెందిన విద్యార్థులకు అంతర్జాతీయంగా భలేడిమాండ్ నెలకొన్నది. కరోనా సమయంలోనూ ఈ స్కూల్లో చదివిన విద్యార్థులకు అధిక వార్షికవేతనం చెల్లించి రిక్రూట్ చేసుకున్నాయి సంస్థలు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో రూ.28.29 లక్షల వార్షిక వేతనంతో ఎగరేసుకొని పోయాయి గ్లోబల్ సంస్థలు. క్రితం ఏడాది సరాసరి వేతనం రూ.26.12 లక్షలతో పోలిస్తే ఇది 8.32 శాతం అధికం కావడం విశేషం. ‘కరోనాతో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఐఎస్బీ నూతన అవకాశాలను సృష్టిస్తున్నది. శిక్షణ రంగంలో తీసుకొచ్చిన కీలక మార్పులు ఇందుకు దోహదం చేశాయి’ అని ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్లో 1,145 విద్యార్థులకు ఆఫర్ లెటర్లు లభించాయి.