లండన్: బ్రిటన్లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. ఆ దేశంలో శుక్రవారం 35 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 22 తర్వాత బ్రిటన్లో గరిష్ఠ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అక్కడ గత వారం రోజులుగా పది లక్షల జనాభాలో సగటున 410 మంది ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రపంచ గణాంకాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బ్రిటన్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందేమోనని వైద్య రంగానికి చెందిన నిఫుణులు అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ నెల 19 నుంచి బ్రిటన్ సాధారణ స్థితికి వస్తుందని, అన్నీ తెరుచుకుంటాయని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. జూలై 19ను “స్వేచ్ఛా దినోత్సవం”గా ఆయన అభివర్ణించారు. అయితే ఈ ప్రకటనపై ఆ దేశ ఆరోగ్య, వైద్య రంగ నిఫుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు ఈ నెల 19 నుంచి సాధారణ పరిస్థితి నెలకొననుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే కరోనా ముప్పు మరింతగా పెరిగే ప్రమాదమున్నదని హెచ్చరించారు.