కోల్కతా: పశ్చిమబెంగాల్లో యాస్ తుఫాన్ సృష్టించిన బీభత్సంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి డుమ్మా కొట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగాల్సిన ఈ సమావేశానికి బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నేతలను ఆహ్వానించడంపై మమత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ మినహా ప్రతిపక్ష నేతలు ఈ సమావేశానికి వస్తే తాను హాజరుకాబోనని ఆమె కేంద్రానికి ఖరాఖండిగా చెప్పారు.
పశ్చిమబెంగాల్లోని కలైకుండలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన యాస్ తుఫాన్ నష్టంపై సమీక్షా సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని గురువారం స్వయంగా ప్రకటించిన మమత శుక్రవారం మనసు మార్చుకున్నారు. సమావేశానికి బీజేపీ నేత సువేందు అధికారి, బీజేపీ ఎంపీ దేబొశ్రీ చౌదరి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను కూడా ఆహ్వానించడాన్ని ఆమె తప్పు పట్టింది. కాగా, ప్రధాని మోదీకి కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో గవర్నర్ జగ్దీప్ ధన్కర్ స్వాగతం పలుకనున్నారు.