లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీచక పర్వం చోటుచేసుకున్నది. అందరూ చూస్తుండగా ఒక మహిళ చీరను ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు లాగారు. బాధిత మహిళ సమాజ్వాదీ పార్టీ మద్దతురాలుగా గుర్తించారు. యూపీలో 825 పంచాయతీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థిని నామినేషన్ దాఖలకు సహాయంగా సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక మహిళ వచ్చింది. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇద్దరు ఆ మహిళపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఆమె చీర లాగారు. అక్కడ ఉన్న మీడియా దీనిని చిత్రీకరించింది. లక్నోకు 130 కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్ ఖేరిలో గురువారం ఈ దారుణం జరిగింది.
కాగా, పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినప్పటికీ 14కుపైగా ప్రాంతాల్లో కొన్ని పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయని పోలీసులు తెలిపారు.