నల్లగొండ : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. భగత్ గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా. సాగర్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ మధ్య కాలంలో మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే భవిష్యత్ ఎన్నికల్లో ఓట్లు అడగమని స్పష్టం చేశారు. ఈ జనాన్ని చూస్తుంటే భగత్ గెలుపు ఖాయమైపోయిందన్నారు. హాలియాలో షాదీఖానా తప్పకుండా కట్టిస్తామన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగురేయండి అని సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.