పది’కి 4,222.. ఇంటర్కు 3,008 దరఖాస్తులు
అధ్యయన కేంద్రాలకు చేరిన పాఠ్యపుస్తకాలు
మార్చి 21 నుంచి వాట్సాప్ ద్వారా ఆన్లైన్ బోధన
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 14 : ఓపెన్ స్కూళ్లకు భారీగా క్రేజ్ పెరిగింది. చదువు మానేసినవారు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు ప్రవేశం పొందుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానించగా.. పదికి 4,222.. ఇంటర్కు 3,008 దరఖాస్తులు వచ్చాయి. వీరి కోసం సర్కారు 109 అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పది విద్యార్థుల కోసం 21,110.. ఇంటర్ విద్యార్థుల కోసం 18,048 పాఠ్యపుస్తకాలు అధ్యయన కేంద్రాలకు చేరుకున్నాయి. ఇక.. మార్చి 21- జూన్ 6 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు.
ఓపెన్ స్కూళ్లకు భారీగా క్రేజ్ పెరిగింది. చదువు మానేసిన, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ తదుపరి పదోన్నతి కోసం పది, ఇంటర్ అర్హతలు అవసరమున్న వారి కోసం తెలంగాణ సర్కారు.. ఓపెన్ స్కూల్ ద్వారా అవకాశం కల్పించింది. కాగా, వారు ప్రవేశం పొందుతున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పది, ఇంటర్ పరీక్షలకు మొత్తం 7,230 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలోనూ యువతీయువకులు ఇంత ఆసక్తి చూపడం అనూహ్య పరిణామమని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్ అన్నారు.
విద్యార్థులకు పుస్తకాలు సిద్ధం..
జిల్లాలో ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలు (పదోతరగతి కోసం 59, ఇంటర్మీడియట్ కోసం 50) ఏర్పాటు చేశారు. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు (పదోతరగతిలో 4,222 మంది, ఇంటర్మీడియట్లో 3,008 మంది) చదువుకునేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఇటీవల అధ్యయన కేంద్రాలకు పంపిణీ చేశారు. విద్యార్థులందరికీ పుస్తకాలను వెంటనే పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. పదోతరగతి విద్యార్థుల కోసం సుమారు 21,110, ఇంటర్ విద్యార్థుల కోసం సుమారు 18,048 పాఠ్యపుస్తకాలు అధ్యయన కేంద్రాలకే చేరాయి. ఈ ఏడాది పది విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారాయని జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు. పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు నచ్చే రీతిలో ఆయిల్ప్రింట్తో ఉన్నాయన్నారు.
ఆన్లైన్ తరగతులు..
విద్యార్థులకు మార్చి 21 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను వీడియోల రూపంలో చూడవచ్చు. అంతేకాకుండా జిల్లాలోని అధ్యయన కేంద్రాల వారీగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల సెల్నంబర్లతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. దీని ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చిన పాఠ్యాంశాల బోధనకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు ఆయా గ్రూపుల్లో షేర్చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు సులువుగా పాఠ్యాంశాలను వినే అవకాశం ఉంది.
ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాం..
టీఎస్ ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ విద్యార్థులందరికీ మార్చి 21 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది. పుస్తకాలు ఇప్పటికే అధ్యయన కేంద్రాలకు పంపించాం. అక్కడి నుంచి విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించాం. జూన్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా పాఠ్యాంశాల వీడియోలను పంపిస్తున్నాం. – అశోక్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్