తిరుపతి, మే1: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైశాఖ మాసంలో లోక కల్యాణార్థం పలు విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ, ఫాల్గుణ, చైత్ర మాస ఉత్సవాలకు భక్తుల నుంచి విశేషాదరణ లభించింది. మే 14న అక్షయతృతీయ సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు లక్ష్మీనారాయణ పూజ జరుగనుంది.
మే 17న శ్రీ శంకర జయంతి సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు జగద్గురు శంకరాచార్య పూజ నిర్వహిస్తారు. మే 25న నృసింహ జయంతి సందర్భంగా తిరుమలలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు టిటిడి అర్చకులు నృసింహస్వామి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. జూన్ 4న హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు టిటిడి అర్చకులు శ్రీ హనుమత్ పూజ చేస్తారు.