మండు వేసవిలోనూ వట్టిపోని జలాశయాలు
వాగులు, చెక్డ్యాంల్లోనూ పుష్కలంగా నీరు
మన ఊరి చెరువులు.. మన ఇంటి సిరులు
కళ్లముందే మిషన్ కాకతీయ ఫలాలు
ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
ఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శతాబ్దాల నాటి ఊర, నల్ల చెరువులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీసింది. మరమ్మతులు చేసింది. దీంతో అప్పటి వరకూ దయనీయంగా ఉన్న చెరువులు, కుంటలు వర్షపు నీళ్లతో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 1487 చెరువులు, భద్రాద్రి జిల్లాలో 2396 చెరువులు ఉన్నాయి. గతంలో ఇవన్నీ వర్షాకాలంలో నిండడం, వేసవికాలంలో అడుగంటి పోవడం వంటివి దృశ్యాలు మాత్రమే కన్పించేవి. మిషన్ కాకతీయతో అభివృద్ధి చేసిన తరువాత అవన్నీ నిండిపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు విరివిగా పెరిగాయి. దీంతో చాలా తక్కువ లోతులోనే నీళ్లు లభ్యమవుతున్నాయి. వానకాలం, యాసంగి పంటలకు పుష్కలంగా నీరందుతోంది.
సాగర్ ఆయకట్టు పరిధిలో..
ఖమ్మం జిల్లాలోని 17 మండలాలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. ఈ ఆయకట్టు ద్వారా రెండు పంటలకూ సాగు నీరు అందించడం ఆనవాయితీ. సాగర్ నీటిని పాలేరు జలాశయానికి తరలించి అక్కడి నుంచి 16, 17 బ్రాంచి కాలువ, బోనకల్లు, మధిర బ్రాంచి కాలువలతోపాటు అన్ని మేజర్, మైనర్ కాలువలకు సాగు నీటిని సరఫరా చేస్తుంటారు. అయితే సాగర్లో జలాలు సమృద్ధిగా ఉండడంతో జిల్లాలో సాగర్ ఆయకట్టు రైతులు రెండో పంటగా యాసంగి వరి సాగు చేస్తున్నారు. దీంతో ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులను ప్రభుత్వం ముందుచూపుతో సాగర్ నీటితో నింపింది. సాగర్ ఆయకటు ్టపరిధిలోగల పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్టు తాళ్లపెంట సరుసుల చెరువు, తుమ్మలపల్లిలోని తుమ్మల చెరువు, కుప్పెనకుంట్ల తామర చెరువు, దీప చెరువు, తల్లాడ మండలం రామానుజవరం చెరువు, కల్లూరు పెద్ద చెరువులతోపాటు మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లోని చెరువులను కూడా సాగర్ నీటితో నింపారు. ఇప్పుడు ఆయా చెరువుల్లో జళకళ ఉట్టి పడుతోంది.
అలాగే బోనకల్లు మండలం రావినూతల చెరువు, మధిర పెద్ద చెరువు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం గరిష్టసాయిలో ఉన్నాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు గరిష్ట నీటిమట్టం 18 అడుగులు కాగా మండు వేసవిలోనూ ప్రస్తుతం 11 అడుగుల వద్ద ఉంది. నిరుడు ఏప్రిల్ నెలలో 9.5 అడుగుల నీటిమట్టం ఉంది. ఇక జిల్లాలో ప్రధాన జలాశయాలైన పాలేరు, వైరా లంకాసాగర్ ప్రాజెక్టులు, బేతుపల్లి చెరువు కల్లూరు పెద్ద చెరువుల్లో సరాసరి నీటి మట్టానికి మించి నీరు ఉంది. పాలేరు రిజర్వాయర్లో గరిష్ట నీటి మట్టం 21 అడుగులు కాగా ప్రస్తుతం 19 అడుగుల నీరు ఉంది. హైదరాబాద్ – ఖమ్మం ప్రధాన రహదారిపై ఉన్న ఈ రిజర్వాయర్లో ఉన్న నీటిని, పకృతి అందాలను పర్యాటకులు ప్రత్యేకంగావచ్చి వీక్షిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పాల్వంచలోని చింతల చెరువు, రాళ్లవాగు, భూపతిరావు చెరువు, మైలవరం చెరువు, సుజాతనగర్లోని సింగభూపాలెం చెరువు, వైరా మండలంలోని సోమవరం నల్లచెరువు, కారేపల్లి చెరువుతోపాటు కొణిజర్ల మండలంలోని మూడు చెరువుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. రైతులకు ఈ నీరు తదుపరి పంటలకు ఉపయుక్తం కానుంది. అలాగే భద్రాద్రి నియోజకవర్గంలోని చర్ల మండలంలోని తాలిపేరు, పెద్ద చెరువు, పులిగుండాల, ఉప్పరిగూడెం చెరువు, సత్యనారాయణపురం చెక్డ్యాం, చింతగుప్ప చెరువు, శ్యాముల దొడ్డి, అల్లీ చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది కూడా మృగశిర మాసంలోనే నారు పోసే అవకాశం కలుగుతుంది. ఉమ్మడి జిల్లా జలభాండాగారంగా విరాజిల్లుతోంది. గతంలో ఏ వేసవిలోనూ లేని విధంగా ప్రధాన జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో తాగు, సాగు నీరు పుష్కలంగా ఉంది.
21 అడుగుల వద్ద పాలేరు నీటిమట్టం
కూసుమంచి, ఏప్రిల్ 19: ఖమ్మం జిల్లాలోని 18 మండలాలకు సాగర్ జలాలను అందించే పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 21 అడుగుల వద్ద ఉంది. పాలేరుకు 3700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నిరుడు ఈ రోజుల్లో పాలేరు నీటిమట్టం 19.5 అడుగులుగా ఉంది. పాలేరు చానెల్కు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 100 క్యూసెక్కులు, భక్తరామదాసు ప్రాజెక్టుకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాల నిలిపివేత
గతేడాది ఆగస్టు 12 నుంచి ఆయకట్టుకు ఎనిమిది నెలల పాటు నిర్విరామంగా సాగర్ జలాలు అందించిన అధికారులు ఆదివారం అధికారికంగా జలాలను నిలిపివేశారు. విడుదలైన జలాలతో 18 మండలాల్లోని 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ప్రస్తుతం ఆయకట్టులో ముమ్మరంగా వరి కోతలు జరుగుతుండటంతో నీటి అవసరం లేదు. దీంతో అధికారులు సాగునీటి విడుదలను నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో కరోనా విజృంభన.. ఒక్కరోజే 22 మంది మృతి
టీకా పంపిణీ విజయవంతం.. ఇకపై మాస్కులు అక్కర్లేదు..!