గజ్వేల్ రూరల్/గజ్వేల్ అర్బన్, మార్చి 21: కొండపోచమ్మ ప్రాజెక్టుకు వెళ్లే కాలువ ద్వారా కాళేశ్వరం జలాలను కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి వదిలి వరి పంటను కాపాడాలన్న గజ్వేల్ మండల రైతుల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. అధికారులతో కలిసి తక్షణమే నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి తన్నీరు హరీశ్రావును ఆదేశించారు. ఆదివారం గజ్వేల్కు వచ్చిన మంత్రి హరీశ్రావుకు స్థానిక రైతులు నీటి సమస్యను వివరించగా.. మంత్రి ఫోన్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సాగునీరిచ్చి పొట్ట దశలో ఉన్న వరిని కాపాడాలని రైతులు మంత్రిని కోరగా.. మొదట అధికారులతో మాట్లాడి కొడకండ్ల జంక్షన్ వద్దకు రావాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ఎస్ఈ వేణుతో కూడవెళ్లి వాగులోకి నీటి విడుదలపై మంత్రి చర్చించారు. అనంతరం రైతుల సమక్షంలోనే హరీశ్రావు సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు.
కొండపోచమ్మ ప్రాజెక్టుకు వెళ్లే కాలువ ద్వారా కొడకండ్ల జంక్షన్ నుంచి కూడవెల్లి వాగులోకి కాళ్లేశ్వరం నీళ్లను వదిలితే.. గజ్వేల్, తొగుట, దుబ్బాక మండలాల్లోని రైతులకు మేలు జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాగుపై ఉన్న 36 చెక్డ్యాంలలో నీటినిల్వ ఉంటే ఈసారి రైతులు సాగు చేసిన వరిని కాపాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. అధికారులతో కలిసి వెంటనే నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. చెబర్తి చెరువును కూడా కాళేశ్వరం జలాలతో నింపాలని, గజ్వేల్ కెనాల్లోకి నీటిని విడుదల చేస్తే వర్గల్ మండలంలోని రైతులకు కూడా న్యాయం జరుగుతుందని సీఎం సూచించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. మండుటెండల్లోనూ రైతులకు సాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 36 చెక్డ్యాంలు నింపుతామని తెలిపారు. తద్వారా గజ్వేల్, తొగుట, దుబ్బాక మండలాల్లోని పొట్టదశలో ఉన్న 11 వేల ఎకరాల వరిని కాపాడుకోవచ్చని చెప్పారు. మంగళవారం రైతులతో కలిసి నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు.
సీఎం, మంత్రి మధ్య సంభాషణ ఇలా..
మంత్రి: కొడకండ్ల వద్ద 100 మీటర్ల దూరంలోనే మంచి పాయింట్ దొరికింది. మల్లన్నసాగర్ మోటర్లు నడుస్తుంటే కొన్ని నీళ్లు దుబ్బాక కెనాల్కు ,కొన్ని నీళ్లు మనకు పైకి కొండపోచమ్మకు వస్తున్నాయి. అవే నీళ్లను చిన్నగా ఓటిలాగా ఓపెన్ చేస్తున్నం. ఓపెన్ చేస్తే రేపు పొద్దున్నుంచే 500 క్యూసెక్కులు పోతాయి.
సీఎం కేసీఆర్: అది వొదిలిపెట్టు. చెబర్తి, పాములపర్తి చెరువులకు విడిచిపెట్టు. గజ్వేల్ కెనాల్కూ వదిలిపెట్టు. జగదేవ్పూర్ కెనాల్ నుంచి చిన్న మైనర్ ఉంది. దాంట్లో విడిచిపెట్టు. మొత్తం ఇక్కడి నుంచే పోతాయి.
మంత్రి: ఎస్ సార్.. అన్ని నింపేస్తాం. మన ప్రతాప్రెడ్డి, ఎస్ఈ వేణు, మాదాసు శ్రీను రైతులు కూడా అందరూ వచ్చిండ్రు. పంటలు ఎండిపోతున్నాయని బతిమిలాడుతుండ్రు.
సీఎం: నౌ గోఅహెడ్.. బుల్లెట్ లాగా చేసేయండి.
మంత్రి: ఇప్పుడు ఇమిడియెట్గా సార్ట్ చేస్తాం సార్.
సీఎం: అర్జెంట్గా చేసేయ్.. గోఅహెడ్, గోఅహెడ్
మంత్రి: థ్యాంక్యూ సార్