దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘తలైవి’. కంగనారనౌత్ టైటిల్ రోల్ని పోషిస్తుండగా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. విబ్రి మీడియా, కర్మ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంగళవారం చెన్నైలో ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. సినీ నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన జయలలిత ఎన్నో అవమానాల్ని తట్టుకొని అకుంఠిత దీక్షతో రాజకీయ రణక్షేత్రంలో విజేతగా నిలిచిన వైనాన్ని ఈ ట్రైలర్లో చూపించారు. ‘ప్రజలను నువ్వు ప్రేమిస్తే..వారు నిన్ను ప్రేమిస్తారు..అదే రాజకీయం’, ‘నన్ను అమ్మగా చూస్తే హృదయంలో చోటుంటుంది. నన్ను కేవలం ఓ ఆడదానిలా చూస్తే…’ వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కంగనారనౌత్ మాట్లాడుతూ ‘దక్షిణాదిలో బంధుప్రీతి, గ్రూపిజం, గ్యాంగుల వంటివి లేవు. మగవారు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు కానీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు సూపర్స్టార్స్ ముందుకురారు. అరవింద్స్వామిలాంటి పెద్ద హీరో ఈ సినిమాలో నటించినందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది.