ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా వేదికలను ప్రభుత్వం కొద్ది గంటల పాటు నిలిపివేసింది. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రాం వంటి సోషల్ మీడియా వేదికలను శుక్రవారం మద్యాహ్నం మూడు గంటల వరకూ సస్పెండ్ చేస్తూ పాక్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) నిర్ణయం తీసుకుంది.
హింసాత్మక నిరసనలతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో దేశీయాంగ మంత్రిత్వ శాఖ సూచనలతో టెలికమ్యూనికేషన్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యాహ్నం మూడు గంటల వరకూ సోషల్ మీడియా వేదికలను పూర్తిగా బ్లాక్ చేయాలని పీటీఏకు రాసిన లేఖలో దేశీయాంగ మంత్రిత్వ శాఖ కోరింది. కాగా శాంతి భద్రతలను కాపాడేందుకు సోషల్ మీడియా వేదికలను తాత్కాలికంగా నిలిపివేశామని పీటీఏ అధికారులు పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తపై ఓ మ్యాగజైన్ కార్టూన్ల ప్రచురణను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్ సమర్దించడంతో పాకిస్తాన్ లో ఫ్రెంచ్ వ్యతిరేక సెంటిమెంట్ నెలకొంది.