కొన్ని చోట్ల పొలం పనులు షురూ
ఈ నెల 1, 2, 3 తేదీల్లో 48 మి.మీ వర్షపాతం నమోదు
రుతుపవనాలు వచ్చిన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలని
రైతులకు సూచిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
వికారాబాద్, జూన్ 3, (నమస్తే తెలంగాణ) : ఈనెల 1 నుంచి వానకాలం మొదలైంది. మొదట్లోనే జిల్లాలో వానలు మోస్తరు నుంచి భారీగా పడుతున్నాయి. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ డివిజన్ల పరిధిలోని ఆయా మండలాల్లో మోస్తరుగా పడింది. రుతుపవనాలు ఈ నెల 10 తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొదటి వానలకే జిల్లాలోని కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలు వేస్తున్నారు. పలు మండలాల్లో రైతులు పొలం పనులు మొదలుపెట్టారు. గురువారం వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట, వికారాబాద్ తదితర మండలాల్లో నల్సు ఏర్పడంతోపాటు అక్కడక్కడ పత్తి విత్తనాలు విత్తారు. జిల్లాలో మొదటి వర్షాలకు సంప్రదాయబద్ధంగా విత్తులు విత్తుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు
జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు వర్షం పడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మండలాల్లో మోస్తరు వర్షం పడింది. ఈ వర్షాలు అల్పపీడనం కారణంగా కురిశాయని, రుతు పవనాలతో వచ్చినవి కావని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎండలతో అల్లాడుతున్న ప్రజలు ఈ వానలతో ఉపశమనం పొందారు. వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో రైతులు పంట పొలాల్లో పనులు మొదలుపెట్టారు. అయితే గడిచిన మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 48 మి.మీ వర్షపాతం నమోదైంది. విత్తనాలు విత్తుకోవాలంటే భూమి 12 ఇంచులు తడువాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వానలు అల్పపీడనం కారణంగా కురుస్తున్నాయని, చాలీచాలని నీళ్ల కారణంగా విత్తనం నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రెండు భారీ వర్షాలు పడినప్పుడే భూమిలో వేడి తగ్గుతుందని, పదును వచ్చినప్పుడే విత్తనాలు నాటితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఈ వర్షాలతో పొలం పనులను ఆరంభించాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దుక్కిదున్నడం, ఎరువులు చల్లడం, రొటవేటర్, ఇతర పనులు చేసుకోవడం ద్వారా రుతుపవనాల సమయానికి సిద్ధంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొదటి వర్షాలకు విత్తనాలు వేసిన తర్వాత వానలు కురువకపోవడం, నీటి వసతి లేక విత్తనం మాడిపోయి నష్టపోవడం జిల్లాలో ప్రతి ఏడాది జరుగుతున్నది.