సిద్దిపేట, జూన్ 15 : తోబుట్టువులా సీఎం కేసీఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలిచారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని తన నివాసంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని మొత్తం 142 మందికి 1,42,41,501 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆడబిడ్డల పెండ్లీలకు లక్షా 116 రూపాయలను అందిస్తున్నదని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇలాంటి పథకాలు లేవని చెప్పారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, సీటీ స్కాన్, ఐసీయూ, డయాలసిస్, డయాగ్నోస్టిక్ కేంద్రాలతోపాటు కొవిడ్ ఐసొలేషన్, బ్లాక్ ఫంగస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ దవాఖానలోని వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి..
కరోనా అంటే భయం.. నిర్లక్ష్యం రెండూ వద్దని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, కరోనా వైరస్ నివారణ కోసం ప్రజలందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు. 18 ఏండ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, సుడా డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ విజయ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంగన్వాడీ, చౌక ధరల దుకాణాలు ప్రారంభం..
సిద్దిపేట అర్బన్, జూన్ 15 : ప్రజా అవసరాలు తీర్చడంతోపాటు దూర వ్యయ భారం తగ్గించేందుకు కేసీఆర్నగర్లో చౌక ధరల దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్నగర్లో మంగళవారం రెండు చౌక ధరల దుకాణాలు, మరో రెండు అంగన్వాడీ కేంద్రాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన కేసీఆర్నగర్లో ప్రజల వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకొని రేషన్షాపులు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రేషన్షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు బియ్యం, పాలు, గుడ్లు, పప్పు, నూనె, బాలామృతం ప్యాకెట్లను మంత్రి హరీశ్రావు అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో రాంగోపాల్రెడ్డి, సీడీపీవో జరీనాబేగం, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో అదనపు కోర్సుకు అనుమతి
సిద్దిపేట అర్బన్, జూన్ 15 : సిద్దిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అదనపు కోర్సుకు అనుమతి వచ్చినట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక విద్యను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేటను సాంకేతిక విద్యాక్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఇంతకుముందు సివిల్ ఇం జినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుకు అనుమతి లభించిందని తెలిపారు.