జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జనగామ రూరల్ సీఐ బాలాజీ వర ప్రసాద్, మృతుడి సోదరుడు సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన అన్నబోయిన భాస్కర్(40) రఘునాథపల్లికి చెందిన మమతతో 14 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు.
భాస్కర్ ఆలేరులో లారీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తూ జీవిస్తున్నాడు. ఇదే క్రమంలో రఘునాథపల్లికి చెందిన మినుముల చందర్రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆలేరులో లారీ డ్రైవర్గా పనిచేసి స్వగ్రామానికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని చందర్రెడ్డి ఇల్లు కిరాయికి తీసుకుని అక్కడికి వచ్చి వెళ్లేవాడు. ఈ నెల 18న భాస్కర్ రఘునాథపల్లికి రాగా, రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. దీంతో చంద్రారెడ్డి అక్కడ నుంచి పారిపోయి ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో విషయాన్ని చెప్పాడు. సీఐ బాలాజీ వరప్రసాద్ సంఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. భాస్కర్ను చందర్రెడ్డే హత్య చేసి ఉంటాడని మృతుడి సోదరుడు సుధాకర్ ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.