కొవిడ్ వ్యాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించాలి
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఆరు మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
చొప్పదండి, మే 11: ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా వైరస్ దూరమవుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్, టెస్టులు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మంగళవారం నియోజకవర్గంలోని ఆరు మండలాల వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా మండలాల్లో కరోనా కేసుల పెరుగుదల, రికవరీ రేటు, మరణాల రేటు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే జ్వర సర్వే, మందుల కిట్ల పంపిణీ తదితర వివరాలను అడిగారు. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో వైద్యాధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరోనా టెస్టులు ఏ గ్రామంలోని వారికి, ఆ గ్రామంలోనే చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, పాజిటివ్ వచ్చిన వారికి అక్కడే మందులు ఇచ్చి పంపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆరుమండలాల వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.