చొప్పదండి/ గంగాధర మే 12: కరోనా కట్డడే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ బుధవారం చొప్పదండి నియోజకవర్గవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు కొనసాగిన కార్యకలాపాలు అనంతరం స్తంభించిపోయాయి. రోడ్లు, చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. నిబంధనల సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలు కోసం దుకాణాలు, మార్కెట్ల వద్ద బారులు తీరారు. పోలీసులు, అధికారులు లాక్డౌన్ను అనుక్షణం పర్యవేక్షించారు. పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన దుకాణాలను మూసివేయించారు. ఎస్ఐ వంశీక్రిష్ణ ఎప్పటికప్పుడూ లాక్డౌన్ అమలుతీరుపై ఆరా తీశారు. అత్యవసరమున్న వారు మాత్రమే బయటకు రావాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పారు. గంగాధర మండలంలో నిత్యం రద్దీగా ఉండే మధురానగర్, గంగాధర చౌరస్తాలు బోసిపోయి కనిపించాయి. బూరుగుపల్లి, గర్శకుర్తి గ్రామాలు జన సంచారం లేక వెలవెలబోయాయి.
రామడుగు మండలంలో…
రామడుగు, మే12: లాక్డౌన్ అమలుతో మండలంలోని 23 గ్రామ పంచాయతీలు, వాటి అనుబంధ గ్రామాల్లో బుధవారం దారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. గోపాల్రావుపేట, రామడు గు, వెదిర, వెలిచాల గ్రామాల్లో జన సంచారం కనిపించలేదు. ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. యువకులు అనవసరంగా బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కరీంనగర్ రూరల్ పరిధిలో..
లాక్డౌన్తో మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 10 గంటల తర్వాత దుకాణా సముదాయాలను మూసివేశారు. రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. ఉద యం 6 గంటల నుంచి 10 వరకు ప్రజలు బయటకు వచ్చి సరుకులు, కూరగాయలు కొనుగోలు చేశారు. కిరాణా దుకాణాల వద్ద వినియోగదారుల సందడి కనిపించింది. మెడికల్ షాపులు యథావిధిగా తెరిచిఉంచారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేశారు.