స్టాక్హోమ్, అక్టోబర్ 5: ప్రపంచ దేశాలను వేధిస్తున్న భూతాపం, వాతావరణంలో మార్పులను అంచనా వేయడంతో పాటు గ్రహాల స్థితిగతులపై కచ్చితమైన విశ్లేషణలు చేసినందుకు గానూ ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ పురస్కారం వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో (జపాన్), క్లాస్ హాసిల్మన్ (జర్మనీ), జార్జియో పారిసీ (ఇటలీ)లను ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం ప్రకటించింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై కచ్చితమైన విశ్లేషణలకుగానూ వీరికి ఈ అవార్డును అందిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇందులో జార్జియో పారిసీకి సగం పురస్కారాన్ని ప్రకటించగా.. మిగతా సగాన్ని సుకురో మనాబో, క్లాస్ హాసిల్మన్ పంచుకోనున్నారు. బహుమతి కింద బంగారు పతకం, రూ.10.43 కోట్ల నగదు లభిస్తాయి.
సుకురో మనాబో (90)- మానవ తప్పిదాలతో పర్యావరణం ఏ విధంగా మార్పులకు గురవుతున్నది? ఎంత మోతాదులో కార్బన్డైఆక్సైడ్ విడుదల కావడం వల్ల భూతాపం పెరుగుతున్నది? తదితర అంశాలపై వాతావరణ నమూనాలను శాస్త్రబద్ధంగా సిద్ధం చేశారు.
క్లాస్ హాసిల్మన్ (89)-భూ పర్యావరణ భౌతిక నమూనా, వైవిధ్యాలను లెక్కించడం, వాతావరణ మార్పుల్లో మనుషుల పాత్రను వివరించారు.
జార్జియో పారిసీ (79)-పరమాణువులు, గ్రహాల స్థితి గతులతోపాటు వలయాకార భౌతిక వ్యవస్థల్లో హెచ్చుతగ్గులు, వాటి పరస్పర చర్యలను విపులీకరించారు. మ్యాథమెటిక్స్, బయాలజీ, న్యూరోసైన్స్, మెషిన్ లర్నింగ్ తదితర రంగాల్లో ఈ అంశాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.