దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాగర్సోల్ నుంచి 75 రోజుల్లో 100 కిసాన్ రైళ్లను నడిపామని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట పరిధిలోని నాగర్సోల్ నుంచి న్యూ గువాహటికి 2021 జనవరి 5న మొదటి కిసాన్ రైలు ప్రారంభించామని, ఇది విజయవంతంగా కొనసాగుతూ.. 75 రోజుల స్వల్ప వ్యవధిలోనే 100 కిసాన్ రైళ్లు నడపడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. కిసాన్ రైళ్లను విజయవంతంగా నడపడం వల్ల వ్యవసాయ రంగానికి బలం చేకూరుతుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కిసాన్ రైళ్ల ద్వారా తూర్పు, ఈశాన్య రాష్ర్టాలకు ఉల్లిపాయలు, ద్రాక్ష పండ్లను రవాణా చేశాం. కిసాన్ రైళ్లకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ద్వారా ‘ఆపరేషన్ గ్రీన్ -టీఓపీ టు టోల్ పథకం’ కింద 50 శాతం చార్జి రాయితీ ఇచ్చారు. కిసాన్ రైళ్ల ద్వారా దూర ప్రాంతాలకు సజావుగా, వేగంగా, అవాంతరాలు లేకుండా, రవాణా మార్గంలో సరుకు నష్ట పోకుండా రుకులు రవాణాకావడంతో రైతులకు, వ్యాపారులకు, కార్గో నిర్వాహకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని పేర్కొన్నారు. నాగర్సోల్ నుంచి 33,885 టన్నుల ఉల్లిపాయలు, 190 టన్నుల ద్రాక్షను రవాణా చేశాం. కిసాన్ రైళ్లలో ప్రధానంగా 10 నుంచి 12 పార్సిల్ వ్యాన్లు ఉంటాయి. ప్రతి పార్సిల్ వ్యాన్లో 23 టన్నుల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. స్వల్ప కాల వ్యవధిలో ఒకే చోట నుంచి 100 కిసాన్ రైళ్లను నడిపించిన అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రత్యేకంగా అభినందించారు.