ఢాకా: వేటగాడు హబీబ్ తాల్కూదార్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన 20 ఏళ్లలో సుమారు 70 పులులను అతను చంపినట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న సుందర్బన్ అడవుల్లో అతను బెంగాల్ టైగర్స్ను చంపేసేవాడు. టైగర్ హబీబ్ కోసం పోలీసులు, అటవీశాక అధికారులు 20 ఏళ్ల నుంచి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుందర్బన్ సమీపంలో ఉన్న మాధ్యా సోనాటోలా గ్రామంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అతనిపై మూడు సార్లు అరెస్టు వారెంట్ జారీ చేశారు. కానీ అతను చాన్నాళ్ల నుంచి పరారీలో ఉన్నాడు. సుమారు 70 పులులను చంపినట్లు హబీబ్ అంగీకరించాడని షారంకోలా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జోయల్ అబెదిన్ తెలిపారు. సుందర్బన్ అడవుల్లోకి వెళ్లవద్దు అని ఆదేశాలు ఉన్నా.. అతను ఉల్లంఘించాడని, నేరాలను కొనసాగిస్తూ వచ్చాడని, అనేక కేసులు అతనిపై ఉన్నాయని, పులుల హత్య వెనుక శక్తివంతమైన గ్యాంగ్లు కూడా ఉన్నట్లు ఆఫీసర్ జోయల్ చెప్పారు. సుందర్బన్ అడవుల్లో ప్రస్తుతం రాయల్ బెంగాల్స్ టైగర్స్ 114 ఉన్నాయి.