రానున్న వర్షాకాలాన్ని దృష్టిలోఉంచుకొని నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్ యశోదపెరల్ వద్ద జరుగుతున్న నాలా విస్తరణ పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీప్తిశ్రీనగర్ నాలావిస్తరణ పనుల్లో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా సత్యనారాయణ ఎన్క్లేవ్వద్ద నాలా పనులను వేగవంతం చేయాలన్నారు. వరదనీరు ప్రవహించే మార్గాలలో తగుజాగ్రత్తలు చేపట్టి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్న గొళుసుకట్టు చెరువులకు వరదనీరు సాపీగా వెళ్లేలా నాలాలను అభివృద్ధిచేసేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలావిస్తరణ పనులను పూర్తిస్ధాయిలో చేపట్టడంద్వారా ఎన్నోఏండ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకు యుద్ధప్రాతిపదికను పనులు చేపట్టి నిర్ణీతగడువులోపు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాధ్రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం చింతల్ క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గం పరిధిలోని 57 మందికి ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.22.68 లక్షల సీఎంఎర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో అనుకోకుండా ఏదైనా అనారోగ్యం సంభవిస్తే మెరుగైన చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న అలాంటి కుటుంబాలకు సీఎం కేసీఆర్ విడుదల చేసే సీఎంఆర్ఎఫ్ నిధి పేదలకు ఎంతో అవసరంగా ఉందన్నారు. అలాంటి సమయంలో సీఎంఆర్ఎఫ్ పథకం ఆపన్నహస్తంలా భరోసాను ఇస్తున్నదన్నారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ నిధులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల పార్టీ నేతలు, లబ్ధిదారులు ఉన్నారు.