బీజింగ్: కరోనా డెల్టా వేరియంట్( Delta variant ).. ప్రస్తుతం ప్రపంచాన్నంతా వణికిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని కరోనా వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది ఇదే. తొలిసారి ఇండియాలో కనిపించిన ఈ వేరియంట్.. ఏ దేశంలో అడుగుపెట్టినా ఆందోళనకర స్థాయిలో విజృంభించింది. అయితే అలాంటి డేంజరస్ వేరియంట్ను చైనా సమర్థంగా కట్టడి చేసింది. 2019, డిసెంబర్లో తొలిసారి వెలుగు చూసిన ఈ కరోనా మహమ్మారిని మొదటి నుంచీ ఆ దేశం సమర్థంగానే కట్టడి చేసింది. ఇప్పుడు కూడా ప్రపంచమంతా డెల్టాను చూసి వణికిపోతుంటే.. చైనా దానికీ చెక్ పెట్టగలిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ దేశం ఈ ప్రమాదకర వేరియంట్ను ఎలా అడ్డుకోగలిగిందో ఒకసారి చూద్దాం.
ఎప్పుడు మొదలైంది?
జులై మధ్యలో మాస్కో నుంచి నాన్జింగ్ వచ్చిన విమానం ద్వారా డెల్టా వేరియంట్ చైనాలో ప్రవేశించింది. ఎయిర్పోర్ట్లో ఉన్న క్లీనింగ్ సిబ్బందికి ఈ డెల్టా వేరియంట్ సోకింది. అక్కడి నుంచి సగం దేశానికి విస్తరించింది. కొన్ని వారాల్లోనే 17 ప్రావిన్స్లలోని 50 నగరాలకు ఇది వ్యాపించింది. తొలి కొవిడ్ కేసు కనిపించిన వుహాన్కు కూడా మళ్లీ వైరస్ చేరింది. అయితే ఇది జరిగిన కొన్ని వారాలలోనే ఇప్పుడు చైనా మళ్లీ కరోనా కేసులను సున్నాకు తీసుకురాగలిగింది. మరి ఇది ఎలా సాధ్యమైంది?
కఠిన ఆంక్షలు
మొదటి నుంచీ కఠిన ఆంక్షలను విధించడం ద్వారా చైనా కరోనాను కట్టడి చేస్తూ వస్తోంది. అయితే ఈ డెల్టా వేరియంట్ విషయంలో ఆ దేశం మరింత కఠినంగా వ్యవహరించింది. భారీ ఎత్తున టెస్టింగ్, ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా.. నిర్ల్యక్షంగా వ్యవహరించిన 50 మంది అధికారులపై వేటు వేసింది. వీళ్లలో స్థానిక ప్రభుత్వాల అధినేతలు కూడా ఉండటం గమనార్హం.
92 లక్షల మందికి రెండేసి సార్లు టెస్టులు
చైనా ఈసారి ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఉండదేమో. డెల్టా వేరియంట్ తొలిసారి కనిపించిన నాన్జింగ్లోని 92 లక్షల మంది జనాభా మొత్తానికి రెండేసిసార్లు పరీక్షలు నిర్వహించారు. గత నెల వ్యవధిలోని మొత్తం 10 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించడం విశేషం. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్లోని ఝెంగ్జౌలో ఎలాంటి లక్షణాలు లేని ఒక్క కేసు బయటపడినందుకు మొత్తం నగరంలోని కోటి మందికి టెస్టులు చేశారు. అంతేకాదు నగర ఆరోగ్య అధికారిని తొలగించారు. ఈ డెల్టా కేసులు కనిపించిన ప్రాంతాల నుంచి రాజధాని బీజింగ్కు ఎవరినీ రానీయలేదు. కఠినమైన క్వారంటైన్ ఆంక్షలు విధించారు. ఇక టూరిస్ట్ ప్లేస్ అయిన హునాన్లోని ఝాంగ్జియాజీలో మొత్తం 15 లక్షల మందిని ఇళ్లకే పరిమితం చేసి.. అన్ని టూరిస్టు ప్లేస్లను మూసేశారు.
ఆర్థిక నష్టమెంత?
డెల్టా వేరియంట్పై చైనా సాగించిన ఈ యుద్ధం ఆ దేశానికి భారీ ఆర్థిక నష్టాన్ని కూడా తీసుకొచ్చింది. జులై, ఆగస్ట్లలో వినియోగం, తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు చైనా వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఆంక్షలను విధించాల్సి రావడంతో నష్టాలను భరించాల్సిందే అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డైరెక్టర్ మా షియావోవీ అన్నారు. ఇక చైనాలో వ్యాక్సినేషన్ కూడా చాలా వేగంగా నడుస్తోంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 194 కోట్ల డోసులు ఇవ్వగా.. 77 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.